కార్తీకదీపం’ ఫ్యాన్స్‌‌కి బిగ్ షాక్.. సీరియల్ నిలిపివేత, ఈటీవీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్

బహుషా.. ఇది బుల్లితెర ప్రేక్షకులు జీర్ణించుకోలేని వార్త. బుల్లితెర బాహుబలిగా.. జాతీయ స్థాయిలో నెంబర్ వన్ రేటింగ్‌తో కోట్లాదిమంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించి.. 761 ఎపిసోడ్‌లుగా ప్రసారం అవుతున్న ‘కార్తీకదీపం’ సీరియల్‌కి బ్రేక్ పడింది. సోమవారం నుంచి శుక్రవారం వరకూ ప్రతిరోజు స్టార్ మాలో ప్రసారం అవుతున్న ‘కార్తీకదీపం’ సీరియల్‌ కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్ల మంది అభిమానులు ఎదురుచూస్తుంటారు. రాత్రి 7.30 అయ్యిందంటే ప్రతి ఇంటిలోనూ దీపాలు వెలిగినట్టే ఈ ‘కార్తీకదీపం’ సీరియల్ వెలుగులు విరజిమ్మాల్సిందే. ఆరనీకుమా.. ఈ దీపం అనే పాట ప్రతి ఇంటిలోనూ మారు మోగాల్సిందే. కాని నేడు (శుక్రవారం) దీప జాడ కనిపించలేదు.. డాక్టర్ బాబు, మౌనిత, సౌందర్య, హిమ, సౌర్య‌ల వేదన, రోదనలు మాయమయ్యాయి. నేటి (శుక్రవారం) రాత్రి ప్రసారం కావాల్సిన సీరియల్‌ ప్రసారాన్ని నిలిపివేశారు. కారణం ఏంటి? అసలు ఈ సీరియల్‌ను ఎందుకు ఆపేశారు? ఈ సీరియల్ ఒక్కటేనా మిగతా సీరియల్స్ కూడా ఆపేశారా? ఈటీవీ సీరియల్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్ ఏంటి? మాటీవీ, జీ తెలుగు సీరియల్స్ ప్రేక్షకులకు బ్యాడ్ న్యూస్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.. 
ఈ ఒక్క సీరియల్ మాత్రమే కాదు.. స్టార్ మాలో వచ్చే అన్ని సీరియల్స్‌ని ఆపేసి ‘బాహుబలి’ చిత్రాన్ని టెలికాస్ట్ చేశారు. ‘కార్తీకదీపం’ సీరియల్‌‌తో పాటు ఇంటింటి గృహలక్ష్మి, సిరిసిరి మువ్వలు, వదినమ్మ సీరియల్స్‌ను కూడా ఆపేశారు. నిజానికి రాత్రి ప్రసారం అయ్యే ఈ సీరియల్స్‌ను హాట్ స్టార్‌లో ఉదయమే అప్ లోడ్ చేస్తున్నారు. అయితే ఈరోజు హాట్ స్టార్‌లో కూడా ఈ సీరియల్స్ రాకపోవడంతో రాత్రి టీవీలలో అయినా ప్రసారం అవుతాయని ఎదురుచూశారు. అయితే సీరియల్స్ క్యాన్సిల్ చేసి బాహుబలి చిత్రాన్ని ప్రసారంచేశారు. స్టార్ మాతో పాటు.. జెమినిలో కూడా సీరియల్స్ నిలిపివేశారు. అయితే జీ తెలుగు, ఈటీవీలలో మాత్రమే సీరియల్స్ ప్రసారం కావడం బుల్లితెర ప్రేక్షకులకు కాస్త ఊరటనిచ్చే అంశం. అయితే వీటిని కూడా ఎప్పుడు ఆపేస్తారో తెలియని పరిస్థితి.

Comments