మహాభారతం అందరికీ అర్దమయ్యేలా తెలుగులో (సరళ వ్యావహారికంలో)- నాలుగోవ భాగము


కుంజరయూధంబు: 
పాండవుల అరణ్యవాసం పూర్తయింది. ఏడాదిపాటు అజ్ఞాతవాసం సాగించాలి. అపడుగాని జూదంలో ఓడిన పాండవులకు విముక్తి లేదు. ధర్మరాజు విషాద ధోరణిలో గతాన్ని నెమరు వేసుకుంటూ వుండగా, ధౌమ్య మహర్షి ఓదార్చాడు. ‘‘ఎంతటి వారికైనా కాలం కలిసిరానపడు సమస్యలు తప్పవు. ధర్మనిర్ణయంలో, రాజ్యపాలనలో, ఔదార్యంలో నిన్ను మించిన వారు లేరు. ధర్మనందనా, ధైర్యము చిక్కబట్టి, జరగవలసిన దానిని గురించి ఆలోచించు’’ అన్నాడు మహర్షి. ధర్మరాజు ఆ మాటలకు తేరుకుని, అక్కడి వారందరికీ కృతజ్ఞతలు తెల్పి, సోదరులతో, ద్రౌపదితో అరణ్యమార్గాన ముందుకు కదిలాడు. నిరంతరం పాండవుల హితం కోరే ధౌమ్య మహర్షి వారిని అనుసరించాడు. ఒక చెట్టునీడలో విశ్రమించి, ఆ రాత్రి అక్కడే గడిపారు. మరునాడు ఉదయం ధర్మజుడు సోదరులతో తమ భవిష్యత్‌ కార్యక్రమం గురించి చర్చించాడు. ‘‘అజ్ఞాతవ్రతం చేయటం అంత సులభం కాదు. పైగా మనం ఆరుగురం ఒక చోటనే వుండడం శ్రేయస్కరం.’’ అన్నాడు ధర్మరాజు. ‘‘మహారాజా, నీ ధర్మనిష్ఠకు మెచ్చి ధర్మదేవత తమకు అనుగ్రహించిన వరం వుంది కదా, మనల్ని ఎవరూ గుర్తించ లేరు. పాంచాల, మత్స్య, సాళ్వ, విదేహ, బాహ్లిక, శూరసేన, కళింగ, మగధ దేశాలలో మనం ఎక్కడైనా అజ్ఞాతవాసాన్ని పూర్తి చేయవచ్చు. ఆ దేశ జనపదాలలో మనం యథేచ్ఛగా వుండవచ్చు గదా’’ అన్నాడు అర్జునుడు.సోదరుని సూచన అందరకూ నచ్చింది. ‘‘నీవు చెప్పింది బావుంది. నాకు మత్స్యదేశం ఆమోదయోగ్యం అనిపిస్తోంది. ఆ దేశాధిపతి విరాటరాజు అన్ని విధాలా యోగ్యుడని విన్నాను. విరటుని కొలువులో మనం ఏ విధంగా చేరాలో ఆలోచించి చెప్పండి’’ అన్నాడు ధర్మరాజు.
తిరిగి వెంటనే, ‘‘నేను కంకుభట్టు అనే పేరుతో పుణ్యపురాణ గోష్ఠి జరిపే బాధ్యతను స్వీకరిస్తాను’’ అంటూ సవివరంగా చెప్పాడు. భీముడు చిరునవ్వుతో ‘‘సోదరులారా, నేను పాకశాలలో చేరి రాజుగారి జిహ్వను ఆకట్టుకుంటాను. వచ్చే పోయే అతిథులను సైతం రకరకాల వంటకాలతో అలరింపజేస్తాను. ఇకపై నా పేరు వలలుడు’’ అనగానే ద్రౌపది తన పెదాలపైకి అప్రయత్నంగా వచ్చిన చిరునవ్వును దాచుకుంది. పాండవ మధ్యముడు అర్జునుడు తన సంగతి వివరించాడు. ‘‘అమరావతికి వెళ్లినపుడు అక్కడ అప్సరస ఊర్వశి నన్ను నపుంసకుడవు కమ్మని శపించింది. కాని ఆ శాప ఫలితాన్ని నా అభీష్టానుసారమే అనుభవించవ చ్చని ఇంద్రుడు నాకు మాట యిచ్చాడు. ఇప్పుడు ఆ శాపాన్ని వరంగా మార్చుకుంటాను. పేడిరూపుతో, బృహన్నల పేరుతో నాట్యాచార్యునిగా విరటుని కొలువులో చేరతాను. లాస్యచాతురిని ప్రదర్శించి, అంతఃపురంలో తిష్ఠ వేస్తాను’’ అనగా అందరూ ఆ ఆలోచనను మెచ్చుకున్నారు. అశ్వశిక్షకునిగా దామగ్రంథి పేరుతో విరటుని కోటలో స్థానం సంపాదిస్తాను అన్నాడు నకులుడు. తంత్రీపాలుడనే పేరుతో మత్య్సదేశాధీశుని గోశాలలో చేరతానన్నాడు సహదేవుడు. ఇక మిగిలింది ద్రౌపది. పాండవుల ముఖాలు వివర్ణం కావడం గమనించిన ద్రౌపది చిరునవ్వుతో, ‘‘సైరంధ్రీ వేషధారినై మత్స్యభూపతి పట్టమహిషి వ్యక్తిగత పరిచారికగా సేవలందిస్తాను’’ అన్నది. ధర్మరాజు ద్రౌపదికి, సోదరులకు తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ వివరించాడు. ‘‘రాజ దర్పాలను, బలపరాక్రమాలను బహిర్గతం కాకుండా కప్పిపుచ్చండి. మన అజ్ఞాతవాసాన్ని భంగపరచడానికి కౌరవ వర్గం అనుక్షణం ప్రయత్నిస్తూ వుంటుందని నిద్రలో కూడా మరువకండి’’ అని మరొకసారి అందరినీ అప్రమత్తం చేశాడు. ఎవరిదారిన వారు విరాట కొలువుకి బయలుదేరబోతున్న తరుణంలో ధౌమ్యమహర్షి వారికి కొన్ని హితోక్తులు యెరుక పరిచాడు.

Comments