
ఒక్కసారిగా ధర్మరాజునకు యేదో గుర్తుకు వచ్చింది. అందరూ చెట్టునీడలో ఆగారు. ‘‘మనం గడుపబోయే అజ్ఞాతవాసంలో, యీ ఆయుధాలు మనల్ని బట్టబయలు చేస్తాయి. అర్జునుని వైపు చూసి, మన ఆయుధాలన్నీ వొక ఎత్తు! గాండీవి కోదండం వొక్కటే వొక ఎత్తు! దానిని యెవరైనా గుర్తించగలరు. క్షణాలలో మన ఉనికి తేటతెల్లమవుతుంది.’’ అన్నాడు. అల్లంత దూరంలో శ్మశాన వాటిక పక్కగా శమీవృక్షం అర్జునుని కంటపడింది. దట్టమైన కొమ్మలతో గాఢాంధకారం గూడుకట్టుకుని వున్న ఆ శమీవృక్షపంపై తమ ఆయుధాలను పదిలపరచడం మంచిదనిపించింది. ఆ చెట్టుపై కాకులు, గుడ్లగూబలు, రాబందులు చేస్తున్న ధ్వనులు భయంకరంగా వున్నాయి. మానవ సంచారం వుండని యీ ప్రాంతంలో, భీతిగొలిపే యీ జమ్మిచెట్టు సరైన తావుగా నిర్థారించారు. ధనుస్సుల అల్లెతాళ్లను తొలగించి, అమ్ముల పొదులను , కవచ కరవాలాలను, గదలను వొక చోటికి చేర్చి, తాళ్లతో బంధించి దానికి శవాకృతి కల్పించారు. ధర్మజుడు త్రిమూర్తులకు, అష్టదిక్పాలకులకు, పంచభూతాలకు, వనదేవతకు నమస్కరించి- యీ దివ్యాయుధాలు అన్యులకు భీకర విషసర్పాలుగా సాక్షాత్కరించునట్లు అనుగ్రహించండని వే డు కున్నాడు.
Comments
Post a Comment