మహాభారతం అందరికీ అర్దమయ్యేలా తెలుగులో (సరళ వ్యావహారికంలో)- ఐదోవ భాగము

కీలక వృత్తులలో  

పాండవులు, ద్రౌపది ముందుగా సిద్ధం చేసుకున్న పథకం ప్రకారం విరాటరాజు కొలువులో చేరారు. మొదట కంకుభట్టారక పేరుతో విరటుని ముఖ్యసలహాదారునిగా, రాజుకి కుడిబుజమైనాడు. భీముడు కమ్మటి భోజనానికి లోటు లేకుండా వలలుడు పేరుతో వంటశాలను కైవసం చేసుకున్నాడు. పాండవ మధ్యముడు బృహన్నలగా, ఆస్థాన నాట్యాచార్యునిగా గజ్జెకట్టాడు. అశ్వహృదయాలను పసికట్టగల చాతుర్యం వుందని నకులుడు దామగ్రంథి అనే మారుపేరుతో అశ్వశాలను ఆక్రమించాడు. గోశాలలో గోసేవకు సహదేవుడు తంత్రీపాలుడు అయ్యాడు. ద్రౌపది పట్టమహిషి సుధేష్ణకు సపర్యలు చేసే దాసిగా మాలిని పేరుతో అంతఃపురంలో స్థిరపడింది. వారు ఆరుగురు విరాటకోటలో అలా చేరడంలో వ్యూహం వుంది. ఎల్లపడూ రాజు సరసన వుండే కంకుభట్టారకునికి లోకవిషయాలు ఎప్పటికపడు తెలుస్తూ వుంటాయి. వృకోదరుని భోజన పరాక్రమం చూస్తే, ఎవరైనా భీమునిగా యిట్టే పసికట్టగలరు. ఇపడు వండివార్చేదీ, పాకశాలలో తొలిగా రుచులు చూసేదీ తనే. కనుక సమస్యలేదు. అర్జునుడు అంతఃపురానికి, వుద్యానవనాలకు పరిమితమైనాడు. లోకవ్యవహారాలు మొదట అంతఃపురాలలోనే పొక్కుతాయి.

ద్రౌపది పట్టమహిషి సేవలోనే వుంటుంది కాబట్టి ఆమెకు తెలియని విశేషాలు వుండవు. అశ్వశాలకు తెలియకుండా రథం కదలదు. కనుక దేశంలో గాని, సరిహద్దుల్లో గాని ఏమాత్రం అలజడి అయినా మొదట తెలిసేది అశ్వశాలకే! అక్కడ నకులుడు వున్నాడు. ఆ రోజుల్లో రాజ్యసంపదలంటే భూమి, గోవులు మాత్రమే. గోధనం సహదేవుని పర్యవేక్షణలో వుంది.అంటే అజ్ఞాతవాసంలో వున్న పాండవుల చేతిలో ఆ రాజ్యపు ఆయువు పట్లు అన్నీ వున్నాయి. దుర్యోధనుడు తన అనుచరులతో వీరి అజ్ఞాతదీక్షను భగ్నం చేసి, మళ్లీ శిక్షను మొదటికి తీసుకు రావడానికి ప్రయత్నిస్తూనే వుంటాడని వీరికి తెలుసు. విరటుడు చాలా చిన్నరాజు. కురు రాజు తలచుకుంటే విరటుడు యెదురు నిలువలేడు. కాని, యిపడు ప్రచ్ఛన్నులై పాండవులు ఆ రాజ్యంలో రాజు నీడలో తలదాచుకున్నారు. ప్రభువు తలలో నాల్కలై వారు నడుచుకుంటున్నారు. సుభిక్షంగా రోజులు గడుస్తున్నాయి.విరాటరాజు నిండుసభలో కొలువు తీరి వున్నాడు. భారీకాయంతో, తాబేళ్లవలె కదలుతున్న కండలతో వచ్చిన వ్యక్తి మహారాజుకి వినమ్రుడై నమస్కరించాడు. ‘‘మహారాజా, నన్ను జీమూతుడు అంటారు. మల్ల యోధుడను. నేల నాలుగు చెరగులా తిరిగి, నాతో తలపడగల వీరుడు దొరక్క విసిగి వేసారి పోయాను. చివరి ప్రయత్నంగా తమ సన్నిధికి వచ్చాను. తమ ఆస్థానంలో నాకు సరిజోడీగా నిలబడగల ధీరుడుంటే రప్పించండి. నా బలప్రదర్శన ద్వారా తమకు వినోదం పంచుతాను. దానితోపాటు నా శక్తిసామర్థ్యాల నిరూపణకు మంచి అవకాశమూ వస్తుంది’’ అన్నాడు. ఆ యోధుని మాటలు విన్న మహారాజు కొలువును కలయ చూశాడు. ఆస్థాన మల్లులు తలలు వంచి తమ అసహాయతను మౌనభాషలో వెల్లడించారు. మహారాజు తలదించుకుని, ఆలోచనలో పడ్డాడు. అంతా గమనిస్తున్న కంకుభట్టు ‘‘మహారాజా, మన పాక నిపుణుడు యితనికి దీటైన వాడుగా తోస్తోంది. అతన్ని రప్పించండి’’ అని సవినయంగా సూచించాడు. మరుక్షణం వలలుడు మల్లరంగంలో సిద్ధంగా నిలిచాడు. యోధులిద్దరూ జబ్బలు చరుచుకుంటూ పరస్పరం కలబడ్డారు. రకరకాల మల్లబంధాలతో చిత్రవిచిత్రగతులతో వలలుడు విజృంభించాడు. జీమూతుడు తట్టుకోలేక మూల్గులతో నేలకొరిగాడు. విజయాన్ని వరించిన వలలుడు ఆతని మూపున మోకాలుంచి, గర్వంగా సభాసదులను పరికించాడు. కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. రాజుగారికి, అన్నగారికి వినమ్రంగా నమస్కరించాడు. మహీపతి తన పరువును, రాజ్యప్రతిష్టను నిలిపినందుకు వలలుని ఉచితరీతిన సత్కరించాడు. సమయానికి తగు సూచన చేసిన కంకుభట్టారకుని మనసా అభినందించాడు. ఆనందం వొకవైపు, నిజరూపాలు బయట పడతాయనే భయం మరొకవైపు సోదరులను అనుక్షణం ఆవరిస్తున్నాయి. వారి వారి మారువేషాలలో, అద్భుతంగా పాత్రపోషణ చేస్తూ, అజ్ఞాతవాసంలో పదిపున్నములను వె ళ్లదీశారు. ఇక రెండు మాసాలు గడిస్తే, గడ్డుకాలం పూర్తవుతుంది- అని వారు వూరట చెందుతూ, రోజులను లెక్కలు కడుతూ వుండగా....

Comments