ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లలోకే పరిమితమవుతున్నారు. దేశంలో లాక్డౌన్ విధించడంతో సెలబ్రిటీలు సైతం సెల్ప్ కార్వంటైన్లోకి వెళ్లిపోయారు. ఈ సమయంలో సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు. వారి సినిమా వివరాలను, రోజంతా ఇంట్లో కాలక్షేపం చేస్తున్న పనులను వారితో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయాన్ని టాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్ ట్విటర్ ద్వారా తెలిపారు. 'లాక్డౌన్ సమయంలో రామాయణం చూస్తున్నాను' అంటూ ట్వీట్ చేశారు.
'దూరదర్శన్ ఛానల్లో ప్రసారమవుతున్న రామాయణం, మహా భారతం నన్ను మళ్లీ బాల్యంలోకి తీసుకెళ్తుంది. మొత్తం కుటుంబంతో కలిసి చూస్తున్నాం. ఇది మా ఫ్యామిలీ వీకెండ్ ప్లాన్. రామాయణం మళ్లీ ప్రారంభం అయినందుకు చాలా ఆనందంగా ఉంది. పిల్లలు భారతీయ పురాణాలను నేర్చుకోవడానికి ఇది గొప్ప మార్గం' అంటూ ఆమె తెలిపారు. కాజల్తో పాటు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ సైతం రామాయణం వీక్షిస్తున్న వీడియోను షేర్ చేశారు.
కాగా, శ్రీరాముని జీవితగాథ ఆధారంగా తీసిన రామాయణం ధారావాహిక మరోసారి దేశవ్యాప్తంగా ప్రజలను అలరించడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ సీరియల్ను ఈనెల 28వ తేదీ నుంచి దూరదర్శన్ డీడీ నేషనల్ చానెల్లో ప్రసారం చేయనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. దేశమంతా కరోనా లాక్డౌన్లో ఉన్న నేపథ్యంలో ప్రజల కోరిక మేరకు ఈ ఆధ్యాత్మిక సీరియల్ను మరోసారి ప్రసారం చేయాలని నిర్ణయించామన్నారు. శనివారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఒక ఎపిసోడ్, తిరిగి రాత్రి 9 నుంచి 10 గంటల వరకు మరో ఎపిసోడ్ను దూరదర్శన్లో చూడొచ్చని శుక్రవారం ఆయన ట్విట్టర్లో ప్రకటించారు. 1987లో మొదటిసారిగా దూరదర్శన్లో రామాయణం ప్రసారమైన విషయం తెలిసిందే.

Comments
Post a Comment