మహాభారతం అందరికీ అర్దమయ్యేలా తెలుగులో (సరళ వ్యావహారికంలో)-రెండవ భాగము


ధౌమ్య ముని హిత వచనములు :                                                         
   
తన సోదరులకు, ద్రౌపదికి పట్టిన దుస్థితికి ధర్మరాజు అపరాధ భావంతో కుంగిపోవడం ధౌమ్యముని గమనించాడు. ‘‘ధర్మనందనా, నువ్వు అనన్య సామాన్యుడవు. కాని, విధి బలీయమైనది. ఇంద్రుడంతటి వాడు ప్రచ్ఛన్నుడై నిషధాద్రిపై తలదాచుకున్నాడు. శ్రీ మహావిష్ణువు వామన రూపుడై అదితి గర్భాన జన్మించలేదా? సూర్యుడు వొకానొక సమయంలో గో గర్భంలో వొదిగి వున్నాడు కదా. తరువాత వామనుడే త్రివిక్రముడై మూడు లోకాలను ఆవరించాడు. తరుణం రాగానే సూర్యుడు స్వయం ప్రకాశంతో విశ్వానికి వెలుగులు నింపాడు. జరిగిన దానికి వగవక, విజయవంతంగా అజ్ఞాతవాసాన్ని పూర్తి చేయండి. మహారాజా, నీ మాటకు కట్టుబడి అర్జునుడు ఉదాసీనంగా వున్నాడుగాని, లేకుంటే కురుశ్రేణిని మట్టుపెట్టడం పెద్దలెక్కలోనిది కాదు- అనగానే ధర్మరాజు మనసు వొక్కసారి ఉప్పొంగింది. ‘‘ఔనౌను, మునీశ్వరా, ఔనౌను’’ అన్నాడు ఉత్సాహంగా తలవూపుతూ.పాండవశ్రేష్ఠులారా, యిప్పటివరకూ మీరు మహారాజులు. యికపై మీరు రాజకొలువులో సేవకు సిద్ధమై వెళ్లనున్నారు. అన్నమాట నిలపడానికి రాజసేవకు సంసిద్ధులు కావడం నిజంగా గొప్ప సంగతి. ఈ సందర్భంలో మీ హితాభిలాషిగా కొన్ని సంప్రదాయాలను వివరిస్తాను.
వాటిని మీరు మనసులో పెట్టుకుని ప్రవర్తిస్తే, మీకు ఎలాంటి ఆపదా వాటిల్లదు. దేశమేలే రాజుకు నేను అత్యంత సన్నిహితుడను, నాకేమని విర్రవీగడం శ్రేయస్కరం కాదు. కోటలో, కొలువులో, వృత్తి ధర్మాన్ని అనుసరించి, యెక్కడ కూర్చోవాలో, యెలాంటి ఆసనాన్ని అధిష్టించాలో గ్రహించాలి. ప్రభుచిత్తం రాజ్యభారం వల్ల రకరకాలుగా మారుతూ వుంటుంది. సమయాసమయాలను పసికట్టి అందుకు అనుగుణంగా ప్రవర్తించాలి. రాజభవనం కంటె అందమైన భవనాన్ని అన్యులెవరూ నిర్మించకూడదు. వేషభాషలలో, ఆహార వ్యవహారాలలో రాజును అనుసరించరాదు. ఒక మెట్టు దిగువన వుండడమే మంచిది. వ్యవహార శైలిలో రాజు ఆలోచనలకంటే గొప్పవి తట్టినా, వాటిని రాజుకు స్ఫురించేలా చెయ్యాలేగాని మన వ్యూహరచనలా వ్యక్తీకరించకూడదు. రాజాదరణ, దానివల్ల అధికారం, గౌరవం, ధనం లభించినపడు వాటిని అదునుగా తీసుకుని మిగిలిన వారిపై దౌర్జన్యం చేయడం ముప తెచ్చి పెడుతుంది. ప్రభువుకి యెదురుగా లేదా వెనుక నిలబడకూడదు. పార్శ్వాలలో మాత్రమే వుండాలి. వినయంగా మాట్లాడాలి. నిష్టుర వచనాలను సైతం మృదుధోరణిలో రాజుకు విన్నవించాలి. క్రోధంలో రాజు తన, మన చూడడని గుర్తెరగాలి. ప్రభువు, ప్రభుతలకు సంబంధించిన రహస్యాలను పొక్కనీయకూడదు. బయటివారి కుట్రలు తక్షణం రాజుకు అందించాలి. అంతఃపుర స్త్రీలతో, పరిచారికలతో మితిమీరిన చనువు పనికిరాదు. అపురూపమైన వస్తువాహనాలు ఏలిన వారు బహూకరిస్తేనే రాజాశ్రితులు స్వీకరించి వినియోగించుకోవాలి. రాజుగారి పొగడ్తకు అతిగా పొంగిపోకూడదు. తెగడ్తలకు కుంగిపోకూడదు. ప్రభువు అప్పగించిన బాధ్యతలను, యెన్ని అవరోధాలు వచ్చినా సకాలంలో నిర్వర్తించడానికి కృషి చెయ్యాలి. మాటలో, శరీర కదలికలో వినయం, వందనం వుట్టిపడాలి.శత్రువులు, వారి గూఢచారులు, రాజ తిరస్కృతులు, దురాలోచనాపరులు- వీరికి దూరంగా వుండాలి. భటుడు ఎపడూ అప్రమత్తుడై, తన జీవనశైలిని రాజదృష్టిలో పడకుండా కాపాడుకోవాలి. రాజు మంచివాడే కావచ్చు. కాని అంతులేని అధికారం వల్ల సంక్రమించే లక్షణాలు కొన్ని వుంటాయి. నేను అనుభవంతో చేసిన సూచనలను పాటించండి. మీరు ఆడుతూ పాడుతూ అజ్ఞాతకాలాన్ని అవలీలగా అధిగమించ గలరు’’ అంటూ దీవించాడు ధౌమ్యమహర్షి. సోదరులు మహర్షికి పాదాభివందనం చేసి, కృతజ్ఞత లు తెల్పుకున్నారు. ధౌమ్యముని మంగళ వైదిక మంత్రాలు పఠిస్తూండగా, పాండవులు, పాంచాలి ముందుకు సాగారు. దశార్ణ దేశానికి ఉత్తర దిశలో పాంచాళ దక్షిణభాగం వుంది. అక్కడ సాళ్వ, శూరసేన రాజ్యాలు వున్నాయి. అవి దాటితే కాళింది నది. నడుస్తున్న అడవిలో రకరకాల ఫలాలు, పట్టుతేనెలు, పుట్టతేనెలు వారిని సంతృప్తులను చేస్తున్నాయి. విరిసిన పుష్పగుచ్ఛాలు సుగంధ పరిమళాలతో శరీరాల సేద తీరుస్తున్నాయి. చల్లని చెట్ల నీడలలో విశ్రమిస్తున్నారు. జలపాతాల కింద, నదీనదాలలో స్నాన సంధ్యాదులు ముగించుకుని, ముందుకు సాగుతున్నారు. వారు మత్స్యదేశ పరిసరాలకు వచ్చారు. మరికొంతసేపటికి విరాట రాజ్య ముఖ్యనగరం, అందులోని రాజసౌధాలు, ఇతర భవనాలు వారికి కనిపించాయి.

Comments