ముంబైలో మ్యాచ్.. మళ్లీ మైదానంలోకి దిగనున్న సచిన్, సెహ్వాగ్!!

ముంబైలో మ్యాచ్.. మళ్లీ మైదానంలోకి దిగనున్న సచిన్, సెహ్వాగ్!!

ముంబై: రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో దిగ్గజ మాజీ క్రికెటర్లతో రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2020 క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర ప్రభుత్వ రోడ్డు భద్రతా విభాగం, అన్ అకాడమీ ఫ్రోఫెషనల్ మేనేజ్‌మెంట్ గ్రూప్ సంయుక్తంగా నిర్వహిస్తోంది. తొలి మ్యాచ్ సచిన్ టెండూల్కర్ ఆధ్వర్యంలోని భారత లెజెండ్స్, బ్రియాన్ లారా సారథ్యంలోని వెస్టిండీస్ లెజెండ్స్ మధ్య మార్చి 7న ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరగనుంది.
వాంఖడే స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌లో చాలా కలం తర్వాత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ జోడీని అబిమానులు చూడనున్నారు. ఒకప్పటిలా ఈ ఓపెనింగ్ జోడి మెరుపులు మెరిపిస్తుందో చూడాలి. వీరితో పాటు యువరాజ్‌ సింగ్‌, అజిత్‌ అగార్కర్‌, మునాఫ్‌ పటేల్‌, మహ్మద్‌ కైఫ్‌, ప్రజ్ఞాన్‌ ఓజా, ఇర్ఫాన్ పఠాన్, జహీర్‌ ఖాన్‌లు ఆడనున్నారు. విండీస్‌ నుంచి చందర్‌పాల్‌, హూపర్, బద్రి, గంగ ఆడుతున్నారు.
భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ దిగ్గజ మాజీ క్రికెటర్లు భాగస్వాములు కానున్న ఈ టోర్నీ ఫైనల్ క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలోని బ్రాబౌర్న్ మైదానం వేదికగా జరగనుంది. సచిన్ భారత జట్టును నడిపించనుండగా.. బ్రియన్ లారా ( వెస్టిండీస్), బ్రెట్‌లీ (ఆస్ట్రేలియాన), జాంటీ రోడ్స్ ( సౌతాఫ్రికా), తిలక రత్న దిల్షాన్ (శ్రీలంక) కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. అన్ని మ్యాచ్‌లు రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్నాయి. కలర్స్, సిన్‌ప్లాక్స్, కలర్స్ కన్నడ, సినిమా చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారంకానున్నాయి. వూట్, జియో డిజిటల్ పార్టనర్స్‌గా వ్యవహరించనున్నాయి.
ఈ టోర్నీలో మొత్తం 11 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. వాంఖడే మైదానంలో రెండు, ఎమ్‌సీఏ స్టేడియం పుణెలో 4, నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో నాలుగు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫైనల్ మాత్రం బ్రాబౌర్న్ గ్రౌండ్ వేదికగా జరగనుంది.
ప్రతీ ఏడాది రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 1.35 మిలియన్లు ఉండగా.. కేవలం భారత్‌లోనే 1,49000 ఉండటం గమనార్హం. అంతేకాకుండా దేశంలో ప్రతీ నాలుగు నిమిషాలకు ఒకరు రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారు. రోజుకు సరాసరిగా సుమారు 1214 మంది ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. గత ఐదేళ్లలో సుమారు 65 లక్షల మంది దివ్యాంగులుగా మారారు. దేశంలో క్రికెట్‌కు ఆదరణ ఎక్కువగా ఉండటంతో ఆ దిశగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతామనే సదుద్దేశంతో ఈ టోర్నీ జరుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఇండియా లెజెండ్స్‌:
సచిన్‌ టెండూల్కర్‌ (కెప్టెన్‌), సెహ్వాగ్‌, యువరాజ్‌, అజిత్‌ అగార్కర్‌, సంజయ్‌ బంగర్‌, మునాఫ్‌ పటేల్‌, మహ్మద్‌ కైఫ్‌, ప్రజ్ఞాన్‌ ఓజా, సాయిరాజ్‌ బహుతులే, కురువిల్లా, జహీర్‌ ఖాన్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, సమీర్‌ దిగే.

Comments