దేశంలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకూ పెరుగుతుండటంతో 21 రోజుల లాక్డౌన్ కొనసాగుతోంది. వైరస్ను వేగంగా వ్యాప్తిచెందే ప్రమాదం ఉందని, ఈ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం పటిష్ట చర్యలు చేపట్టడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ప్రస్తుతం దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 650 దాటింది. మంగళవారంతో పోల్చితే బుధవారం కోవిడ్-19 కేసుల సంఖ్య పెరిగింది. బుధవారం ఒక్క రోజే కొత్తగా 94 కేసులు నమోదవుతున్నాయి. సోమవారం అత్యధికంగా 99 కేసులు నమోదు కాగా, మంగళవారం ఈ సంఖ్య తగ్గింది.
అయితే, మళ్లీ బుధవారం కేసుల సంఖ్య పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటి వరకూ అత్యధికంగా మహారాష్ట్రలో 119, కేరళలో 114 కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ కారణంగా ఇప్పటి వరకూ 10 మంది చనిపోయారు. తమిళనాడులో బుధవారం తొలి కరోనా మరణం చోటుచేసుకుంది. తెలంగాణలోనూ కరోనా వైరస్ క్రమంగా వ్యాప్తిచెందుతోంది. బుధవారం కొత్తగా మరో ఇద్దరికి వైరస్ నిర్ధారణ అయినట్టు అధికారులు తెలిపారు. దీంతో తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 41కి చేరుకుంది.
బుధవారం ఓ మూడేళ్ల బాలుడు, ఓ మహిళకు కొవిడ్ 19 నిర్ధారణ అయింది. తెలంగాణలో మూడేళ్ల బాలుడికి ఈ వ్యాధి సోకడం ఇదే తొలిసారి. గోల్కొండ ప్రాంతానికి చెందిన ఆ కుటుంబం బాలుడితో సహా ఇటీవల సౌదీ అరేబియా వెళ్లివచ్చింది. బాలుడిలో జలుబు, దగ్గు లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రిలో చేర్చారు. పరీక్షల్లో కరోనా నిర్ధారణ అయింది. ఈ బాలుడి తల్లిదండ్రులనూ ఆసుపత్రిలో చేర్చారు. వీరికి గురువారం పరీక్షలు నిర్వహించనున్నారు. కొద్దిరోజుల క్రితం లండన్ నుంచి వచ్చిన కోకాపేటకు చెందిన వ్యక్తి(49)కి కరోనా నిర్ధారణ కాగా.. ఆయన భార్యకు(43) వైరస్ సోకినట్లు బుధవారం తేలింది.
ఆంధ్రప్రదేశ్లోనూ బుధవారం మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 10కి చేరుకుంది. మార్చి 20న అమెరికా నుంచి విజయవాడ వచ్చిన యువకుడి (22)కి కరోనా సోకింది. అలాగే ఈ నెల 14న ఢిల్లీలోని నిజాముద్దీన్ మసీదులో మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్న గుంటూరుకు చెందిన వ్యక్తి (52)కి కూడా కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో గుంటూరులో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లయింది.
Comments
Post a Comment